
లాస్ ఏంజెల్స్ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ నాటునాటు పాటను పాడారు. ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. చంద్రబోస్ పాటను రచించారు. రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ.. “నాటు నాటు” పాటను ఏండ్ల తరబడి స్మరించుకుంటారని ప్రధాని మోదీ (PM Modi) ట్విట్టర్ లో తెలిపారు. తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును (Oscar award) గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును ఈ పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాజమౌళి ధైర్యం, దార్శనికతతోనే ఈ అద్భుతం సాకారమైందని చిరంజీవి , భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని పవన్ కల్యాణ్, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు..




