
సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు, ఆందోల్ పర్యటించాను. రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. వృద్ధులకు పెన్షన్లతో గౌరవం పెరిగింది. ఏడేళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. సంగారెడ్డి, జహీరాబాద్, ఆంధోల్ ప్రాంతం కూడా ఉద్యమంలో ముందుకు ఊరిగింది. బ్రహ్మాండంగా పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేశంలో రైతుబందు పథకం ఎక్కడా లేదు. తెలంగాణను బాగుచేసినట్లే దేశ రాజకీయాల్లోనూ పోరాడుతా. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్లోని 11 మండలాల్లోని 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగుకు 12 టీఎంసీల నీళ్లు రానున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్ నియోజకర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాల్లోని 1.65 లక్షల ఎకరాల సాగుకు 8 టీఎంసీల నీటిని అందించనున్నారు.


