
2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది(మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్, ప్రముఖ ఆర్కిటెక్ట్ బీవీ దోశీకి మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వరదన్కు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, సమాజ సేవకురాలు సుధామూర్తి, గాయని వాణీ జయరాంతోపాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్తలు స్వామి చిన్న జీయర్, కమలేష్ డి పటేల్కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించారు. గుజరాత్కు చెందిన కమలేశ్.. హైదరాబాద్లో రామచంద్ర మిషన్ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్.విజయ్ గుప్తా(సైన్స్, ఇంజినీరింగ్), పసుపులేటి హనుమంతరావుకు (వైద్యం), బి.రామకృష్ణారెడ్డికి (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గణేశ్ నాగప్ప కృష్ణరాజ నగర, అబ్బారెడ్డి నాగేశ్వర రావు(సైన్స్, ఇంజినీరింగ్ విభాగం), కె.సచ్చిదానంద శాస్త్రి, సీవీ రాజు(కళలు), సంకురాత్రి చంద్రశేఖర్(సమాజ సేవ), ప్రకాశ్ చంద్ర సూద్(సాహిత్యం, విద్య)కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా(మరణానంతరం), ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టండన్కు పద్మశ్రీ లభించింది.




