
పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేకుండానే హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క స్కూలు కూడా మూసివేయకుండా టీచర్లను సర్దుబాటును చేయాలని భావిస్తున్నది.ఐదుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉం టే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థులు లేని స్కూళ్లకు కూడా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టును కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. టీచర్ల హేతుబద్ధీకరణకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవో- 25 జారీచేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలను జారీచేశారు. జిల్లా స్థాయిలో హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో ఏవైనా సమస్యలుంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అప్పీలు చేసుకోవచ్చు. ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలి. బడుల హేతుబద్ధీకరణను జిల్లాస్థాయి కమిటీ చేపడుతుంది.

ఒక్క విద్యార్థీ లేని పాఠశాలకు సైతం ఒక ఉపాధ్యాయ పోస్టు ఉంచాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇంగ్లీష్, గణితం బోధించే సబ్జెక్టు టీచర్లు అవసరానికి మించి ఉన్నట్లు చెబుతున్నారు.రాష్ట్రంలో 1.08 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, అందులో సుమారు 6 వేల ఎస్జిటి పోస్టులు, 8,150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,970 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తే 13 వేల వరకు ఎస్జిటి పోస్టులు ఖాళీ అయ్యే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. వీటిలో సుమారు ఐదున్నర వేల పోస్టులను ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులుగా మార్చి, మిగిలిన 7 వేలపైగా పోస్టులను డిఇఒ పోల్లో పెట్టే ఆలోచనలో అధికారులున్నట్టు తెలుస్తోంది. అంటే ఆ 7 వేల పోస్టులు ఇక ఉండవని టీచర్స్ యూనియన్లు పేర్కొంటున్నాయి.రాష్ట్రంలో 1.08 లక్షల మంది టీచర్లు ఉండగా, శాంక్షన్డ్ పోస్టులతో పోలిస్తే 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కేవలం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోనే 9,221 పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పింది. ఈ క్రమంలో రేషనలైజేషన్ తో ఎక్కువున్న పోస్టులను తగ్గించుకోవచ్చని సర్కారు భావిస్తోంది.



