
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు తొలిమెట్టుగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ సక్సెస్ మంత్ర.. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను కూడగట్టారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంచార్జీగా వ్యవహరించిన లెంకలపల్లిలో టీఆర్ఎస్ కు 254 ఓట్ల ఆధిక్యం వచ్చింది. హరీశ్రావు (మర్రిగూడ–613 ఓట్లు), నిరంజన్రెడ్డి (దామెరభీమనపల్లి–613 ఓట్లు), కేటీఆర్ (గట్టుప్పల్ ఎంపీటీసీ 1, 2 పరిధి–65 ఓట్లు), సత్యవతి రాథోడ్ (పొర్లగడ్డ తండా–288 ఓట్లు), సబిత (పసులూరు గ్రామం–332 ఓట్లు), గంగుల (సంస్థాన్ నారాయణపురం–66 ఓట్లు), ఎర్రబెల్లి (చండూరు 2, 3 వార్డుల పరిధి–488 ఓట్లు) ఇంచార్జీ లుగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ కి ఆధిక్యం వచ్చింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి తుది వరకు రౌండు రౌండుకూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది.




