
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్కు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుకొస్తే వారికోసం ప్రత్యేకంగా పారిశ్రామిక సముదాయాన్ని (క్లస్టర్) అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న కేటీఆర్, శుక్రవారం ప్యారిస్లోని ఆ దేశ సెనేట్లో ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్: డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ ఏ పోస్ట్ కొవిడ్ ఎరా’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. భారత్లో ఇతర రాష్ట్రాలు ఇస్తున్న మినహాయింపులు, రాయితీలను తమతో ప్రస్తావిస్తే.. అంతకుమించి తామూ అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గత ఏడే ళ్లలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కెటిఆర్ వివరించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ గురించి కేటీఆర్ వివరించారు. 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయని.. లేదంటే 16వ రోజున అనుమతులు లభించినట్లే భావించ వచ్చన్నారు.టీఎస్ఐఐసీలో రెండు లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ భూములకు విద్యుత్తు, నీరు, ఉత్తమ మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ప్రభుత్వం తన సొంత ఖర్చులతో నైపుణ్య శిక్షణ ఇస్తూ యువకులను నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తున్నదని వివరించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పలు వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. ఫ్రాన్స్లో అతిపెద్ద పారిశ్రామిక వేత్తల సమాఖ్య అయిన మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఇడీఈఎఫ్) డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో భేటీ అయింది.ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ ‘స్టేషన్ ఎఫ్’లో మంత్రి కేటీఆర్ పర్యటించి స్టేషన్ ఎఫ్ బృందంతో భేటీ అయ్యారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థల గురించి వివరించారు. స్టేషన్ ఎఫ్లో వెయ్యి స్టార్టప్లు ఉన్నాయి. ఏడీపీ చైర్మన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్తో కూడా కేటీఆర్ బృందం సమావేశమైంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు.




