
టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి.కవిగా, సినీ పాటల రచయితగా, నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు. సిరివెన్నెల సమారు 3 వేలకు పైగా పాటలు రాశారు. అదేవిధంగా 165కుపైగా చిత్రాలకు పూర్తిస్థాయిలో పాటలు రాశారు. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. ఆయన తన రచనలతో 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా.. తన సినీజీవితంలో 11 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.




