
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా .. పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వేతనజీవులు, మధ్యతరగతివర్గాలకు పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది.
ప్రాధాన్యతా అంశాలు:
- సమ్మిళిత వృద్ధి
- చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు
- మౌలిక సదుపాయలు-పెట్టుబడులు
- సామర్థాల వెలికితీత
- స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి
- యువశక్తి
- విత్త విధానం
ధరలు తగ్గే వస్తువులు: ఎలక్ట్రిక్ వాహనాలుటీవీలు, మొబైల్స్, కెమెరాలు, కిచెన్ చిమ్నీలు, వజ్రాల ధరలు
ధరలు పెరిగే వస్తువులు: టైర్లు, రబ్బర్, సిగరెట్లు, బ్రాండెడ్ వస్తువులు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఏకలవ్య స్కూళ్లకు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరగనున్నది. రానున్న మూడేళ్లలో ఆ స్కూళ్లకు 38 వేల మంది టీచర్లను రిక్రూట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని… రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను…. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను… రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Bachat Patra) పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.




