
మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి వారం రోజుల ముందు అంటే మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాతే ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని తాను 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశామని చెప్పారు.సీఎం కేసీఆర్ తొలుత తన వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి ఆలయానికి పలువురు ప్రముఖులు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. తిరుమల తరహాలో యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం మొత్తం 125 కిలోల బంగారం అవసరమవుతుందని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం ముఖ్యమంత్రి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన కాసేపటికే 22 కిలోల బంగారం విరాళంగా సమకూరింది.




