
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ తొలిదశ విజయాన్ని అందుకుంది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. గురువారం ప్రారంభమైన కౌంట్డౌన్ 25.30 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు ముగిసింది. రాకెట్ అనుకొన్న విధంగా పయనించి శిఖర భాగాన ఉన్న మాడ్యూల్ను 16.5 నిమిషాల్లోనే భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు (పెరిజి), భూమికి దూరంగా 36,500 కిలో మీటర్లు ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మిషన్ కంట్రోల్ సెంటర్లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇస్రో రాకెట్ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటికీ.. జాబిల్లిని చేరాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. దశాబ్దాల క్రితం అమెరికా చేపట్టిన అపోలో 11కు మాత్రం కేవలం నాలుగు రోజులే పట్టింది. రష్యాకైతే ఒకటిన్నర రోజులే. ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. తక్కువ వేగంతో వెళ్లడం, ప్రాజెక్టు ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఇస్రో భిన్న మార్గాన్ని ఎంచుకుంది. భూమి గ్రావిటీ సహాయంతో చంద్రుని వైపు ప్రయాణించే విధానాన్ని అనుసరిస్తోంది. చంద్రయాన్-3 భూమి చుట్టు 24 రోజుల పాటు తిరుగుతూ కక్ష్యను పెంచుకుంటూ పోతుంది. చివరికి చంద్రుని గ్రావిటీ క్షేత్రంలోకి చేరుకుంటుంది. అందుకే ఈ ప్రక్రియకు దాదాపు 40 రోజులు పడుతుంది.




