30వ తేదీన సిఎం కెసిఆర్ చేతుల మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ప్రారంభం
admin April 29, 2023 0 COMMENTS
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం (ఏప్రిల్ 30) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనాన్ని పార్లమెంట్భవనం సెంట్రల్ విస్టా కన్నా విశాలంగా నిర్మించారు. దేశంలోనే ఎత్తైన భవనంగా, ఎంతో గంభీరం ఉట్టిపడేలా దీని నిర్మాణం జరిగింది. ఓవర్హెడ్ ట్యాంక్ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపును సైతం ఏర్పాటు చేశారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. ఈ భవనంలో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని కూడా హరిత భవన మండలి ప్రమాణాల మేరకు నిర్మించామని హరిత భవన మండలి హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి.శేఖర్రెడ్డి తెలిపారు. అయితే కొత్త సచివాలయం గోల్డ్ రేటింగ్ కోసం ఎంపికైందన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…
నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.దివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్లు అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు. ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చింతల్బస్తీ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు అనుమతి నిరాకరించారు. అలాగూ.. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించారు. అలాగే.. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఎల్లుండి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.




