
గత ఏడాది హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం కురిసింది..అపుడు అశోక్ నగర్,గోల్నాక పరిసరాలు నీటి మునిగాయన్నారు మంత్రి కేటీఆర్. అప్పుడు స్థానికులతో మాట్లాడానన్నారు. 12 కిలోమీటర్లు ఉండే ఈ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నాలలకు శాశ్వత పరిష్కారం కోసం SNDP ( స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం ) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో భాగంగా సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రూ.858 కోట్లతో నాలాలను విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్ నుంచి మొదలై మూసీలో కలిసే వరకు వరద నీటి నాలాకు రెండు వైపులా రూ.68.4 కోట్ల వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నల్లకుంటలో నాలా రక్షణగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్.జీహెచ్ఎంసీ ఒక్కటే కాదు పక్కన ఉన్న మున్సిపాలిటీల్లో కూడా పనులు చేపడతామన్నారు.




