
భారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇదే నెలలో జరిగే శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ మౌళిక సదుపాయాల మార్కెట్ను బలోపేతం చేశామన్నారు. ఎంఎస్పీ పెంచామన్నారు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లను పెంచామన్నారు. తాము చేపట్టిన ప్రొక్యూర్మెంట్ విధానం గత ప్రభుత్వ రికార్డులను బ్రేక్ చేసిందని ప్రధాని మోదీ తెలిపారు.కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించలేకపోయాం. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. రైతులను ఒప్పించలేకపోయినట్లు మోదీ తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి… క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి” అంటూ ప్రధాని భావోద్వేగంతో ప్రసంగించారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.




