
కొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ కల్చర్ ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అక్టోబర్ 21(గురువారం) వరకు భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం 100 కోట్ల కరోనా టీకా మార్కును దాటిన వేగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు.కరోనా మహమ్మారి ప్రారంభంలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమనే భయాలు వ్యక్తమయ్యాయి.దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణలతో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. దేశ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.100 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే దీపావళి పండుగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు.దేశంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయని చెప్పారు. రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు వేయడమంటే ఇది సాధారణ విషయం కాదని తెలిపారు.




