
తెలంగాణలోనూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.రానున్న రోజుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ ఉంటాయన్నారు డీహెచ్. ప్రస్తుతం డెల్టా50 శాతం, ఒమిక్రాన్ 50 శాతం కేసులు ఉన్నాయన్నారు. దేశంలోని 15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదయ్యాయని.. జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. .జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందన్నారు.ఆక్సిజన్ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రులతో చేరిన వారిలో దగ్గు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు కోటి వరకు హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖలో సెలవులు రద్దు చేశామన్నారు.




