
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది అంతకంతకూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆందోళన నెలకొంది.టెక్సాస్ రాష్ట్రంలో గతంలో కోవిడ్ నుంచి కోలుకున్న ఒక మధ్య వయస్కుడికి ఒమిక్రాన్ సోకి పరిస్థితి విషమించి మరణించారని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. అతడు కోవిడ్ టీకాలు తీసుకోలేదని హ్యారిస్ కౌంటీ ప్రజారోగ్య విభాగం పేర్కొంది.అమెరికాలో మొన్నటిదాకా ఒమిక్రాన్ కేసులు కేవలం 3 శాతం ఉండగా.. గత వారంలో 73 శాతానికి పెరిగాయని ఫెడరల్ హెల్త్ అధికారులు చెప్పారు. వారం రోజుల్లో 6.5 లక్షల మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) లెక్కలు చెబుతున్నాయి. న్యూయార్క్లో నమోదైన మొత్తం కేసుల్లో 90 శాతంపైగా కొత్త వేరియంట్ కేసులే. అయితే ఇప్పటిదాకా ఎంత మంది ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రుల్లో చేరారు, ఎంత మంది చనిపోయారనే విషయంపై తమ దగ్గర లెక్కలు లేవని సీడీసీ తెలిపింది. ఆ దేశంలో 24 గంటల్లో 90,629 కేసులు నమోదు కావడం గమనార్హం. ఫ్రాన్స్ లోనూ 72,832, స్పెయిన్లో 49,823 కేసులు 24 గంటల్లోనే నమోదయ్యాయి. పలు దేశాల్లో మళ్లీ కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రపంచం కరోనా వల్ల మరోసారి ముప్పు ఎదుర్కోనుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లూగే కూడా ప్రకటించారు.




