
తెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు.ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈనెల 20 వరకు గడువు విధించింది. ఒకవేళ కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే రాష్ట్ర వైఖరిని వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే మరికాసేపట్లో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేపట్టనున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్థారించాలని కోరేందుకు తాను స్వయంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కలిశానని గుర్తుచేశారు. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్ సి ఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇందిరాపార్క్లో ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకుంటున్నారు.




