ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం
admin September 29, 2021 0 COMMENTS
సెప్టెంబర్ 28 (మంగళవారం)న అఫ్జల్గంజ్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’, ‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’, ‘దక్కన్ హెరిటేజ్ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. 150 మందిని కాపాడిన చింతచెట్టు జ్ఞాపకార్థం గత 13 సంవత్సరాల నుండి ‘ఫోరం ఫర్ ఎ ఫటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్మారక సమావేశం నిర్వహిస్తుంది. ఆ ఘటన జరిగి 113 సంవత్సరాలు సందర్భంగా ఈ ఏడాది కూడా సమావేశం నిర్వహించి మృతులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ అధ్యక్షులు మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ…. 1908లో మూసీ వరదల సమయంలో నిజాంగా మీర్ మహబూబ్ అలీపాషా ఉన్నారు. వరద పరిస్థితులను చూసి, ఇకపై మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని ఆలోచించారు. 1914లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీపాషా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయించారు. నాటి సుప్రసిద్ధ ఇంజినీరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి రెండు జలాశయాలు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలని సూచించారు. వారి సూచనల మేరకు 1920లో ఉస్మాన్సాగర్, 1927లో హిమాయత్సాగర్లను నిర్మించారు. ఈ రెండు జలశాయాలు మంచినీటి వసతిని కల్పిస్తున్నాయి. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆట స్థలాలు, స్లమ్ క్లియరెన్స్, హౌజింగ్ కాలనీల నిర్మాణం, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు, మూసీ నదికి రెండు పక్కలా రక్షణ గోడలను విలక్షణ శైలితో నిర్మించారు. మూసీనది తీరం వెంట హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, అసఫియా లైబ్రరీ లాంటి ఎన్నో అద్భుత కట్టడాలు రూపుదిద్దుకున్నాయని ఫోరం అధ్యక్షులు మణికొండ వేదకుమార్ పేర్కొన్నారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్లు సర్ అలీ నవాబ్ జంగ్, కద్మైత్యార్ జంగ్ లాంటి వారు ఆయా పనుల్లో కీలకపాత్ర వహించారని వక్తలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూసీకి మహర్దశ తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధప్రాతిపదికన హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి వ్యవస్థకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని పట్టణాలకు ధీటుగా గుర్తింపు పొందేందుకు ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికలను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ వంతుగా ఎఫ్బిహెచ్ తరఫున మూసీనది ప్రక్షాళన మరియు సుందరీకరణ కోసం కొన్ని సూచనలు చేయనున్నట్లు ఫోరం వక్తలు తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికే మూసీ నదీ పరివాహక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. గతంలో మూసీనది నీటిని మంచినీరుగా తాగేవారు. ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవతో కొంత సమయం పట్టినా కూడా, మళ్లీ అటువంటి రోజులు వస్తాయని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈకార్యక్రమం అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’లో భాగంగా సజ్జన్సింగ్ (కన్వీనర్ సిఖ్ హెరిటేజ్ ట్రస్ట్), జనాబ్ సాహిద్ ఫర్హీద్ (పైగా నవాబ్ ఫ్యామిలీ) చింత చెట్టు ఆవరణలో మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.హెచ్.రావు – వైస్ ప్రెసిడెంట్, శ్రీమతి శోభాసింగ్ – జనరల్ సెక్రటరీ, సజ్జన్ సింగ్ – సిఖ్ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్, జనాబ్ సాహిద్ ఫర్హీద్ – పైగా నవాబ్ ఫ్యామిలీ, జి. వేణుగోపాల్ – ఎఫ్బిహెచ్ సభ్యులు, ప్రొఫెసర్ అన్వర్ఖాన్, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, లైన్స్ ధనుంజయ్ , అప్జల్గంజ్ సీఐ రవీందర్రెడ్డి , సుతారపు వెంకట నారాయణ, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాల, ఇంజనీరింగ్, ఫార్మసీకళాశాల ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ టీచర్లు, స్టూడెంట్స్, ఎస్ఆర్డి రైన్బో హోమ్ ఫర్ ఆర్ఫాన్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




