
ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్.సోమవారం మధ్యాహ్నం 12 గంటల అంతిమయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వెళ్లి భూదేవినగర్లోని ఆయన ఇంటికి తీసుకుని కొద్దిసేపు ఉంచి తరువాత 2 గంటలకు గద్దర్ స్దాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుంటు సభ్యులు తెలిపారు. గద్దర్ ఉన్నత విద్య ఇంజనీరింగ్ చదివి కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా తెలంగాణలోని భూస్వామ్య స్వభావం, భూమి చుట్టూ అలుముకున్న జీవితాలతో చలించిపోయారు. సమాజాన్ని మేల్కొల్పాలని భావించారు. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్న ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవ పార్టీలో ఉండి పూర్తికాలం కార్యకర్తగా గడిపారు.




