
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్పై పూర్తిగా ఫోకస్ చేయాలని సూచించింది. బి.ఆర్.కె.ఆర్. భవన్ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు కేటీ.రామారావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పాల్గొ్న్నారు. వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో పబ్లిక్ ప్లేసుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హరీశ్ సూచించారు. ఒమిక్రాన్ పై ఆందోళన అక్కర్లేదని, జాగ్రత్తగా ఉంటే చాలని కేటీఆర్ అన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆఫీసర్లకు సూచించారు. విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు పెట్టాలని సబిత సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, పురపాలక శాఖల సంపూర్ణ సహకారంతో వ్యాక్సినేషన్ను వేగంగా ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.




