రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
admin September 7, 2021 0 COMMENTS
సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది.లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెలుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, చెరువులు, కుంటల పరిస్థితిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వరద ప్రభావిత కాలనీలకు హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలించనున్నారు. ఇక పట్టణంలోని వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. వేములవాడ రాజన్న ఆలయం ముందు వర్షపు నీటితో ముందు భాగంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షంతో రాజన్న దర్శనానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ద్రోణిగా మారడంతో.. రాష్ట్రమంతటా హెచ్చరికలు జారీ చేశారు.




