
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం…ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని అన్నారు.పంజాబ్లో వడ్లు కొన్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలని తాము డిమాండ్ చేశామని, ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని ఢిల్లీకి పోయి అడిగినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. ఈ తీరును నిరసిస్తూ ఈ రోజు మహాధర్నా చేపట్టామన్నారు.కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ యుద్దం ఇంతటితో ఆగిపోదు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు.ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు అని సీఎం స్పష్టం చేశారు.




