
కృష్ణా జలాల్లో తెలంగాణకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ డిమాండ్ చేశారు.అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణా జలాల వాటాపై ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.లంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రశ్నిస్తామన్నారు. నీటి అవసరాలు తీరాలంటే విద్యుదుత్పత్తి అత్యంత ఆవశ్యకమని రజత్ కుమార్ అన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచీ.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉందని చెప్పారు.రాష్ట్ర అవసరాలతో పోలిస్తే 299 టీఎంసీలు చాలా తక్కువ అని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలపెట్టిన ప్రాజెక్టే అని ఆయన గుర్తు చేశారు. కృష్ణా నదిపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నాం.బేసిన్ అవతల కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.




