
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సిడిఎంఏ ఆఫీస్లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్ రూఫ్ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్రూఫ్ ఉపయోగపడుతుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్లో 5 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ అమలుచేస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్రూఫ్ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్కు హైదరాబాద్లో రెండు ప్లాంట్లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ ఆన్నారు.




