
ఈ-వెహికిల్స్ హబ్గా రాష్ట్రం మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మాదాపూర్ హైటెక్స్లో బుధవారం ఎలక్ర్టిక్ వాహనాల ‘ఈవీ ఎక్స్పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీల ప్రోత్సాహానికితెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఈవీ మోటార్ షోలలో ఒకటైన హైదరాబాద్ ఈ-మోటార్ షోను ప్రారంభించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. క్లీన్ ఎనర్జీని వినియోగించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.అపోలో, మహీంద్రా, అమరరాజా, టీవీఎస్, ఈటీవో మోటార్స్, ఓలా, ఎంజీ మోటర్స్తోపాటు ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు ఈ షోలో భాగస్వామ్యంకావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ త డిసెంబరులో అమరరాజా తన అత్యాధునిక గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుందని, ఇది రాష్ట్రంలో సమగ్ర ఈవీ, అడ్వాన్స్డ్ కెమిస్ర్ట్రీ సెల్ ఏకోసిస్టమ్ అభివృద్ధికి మార్గంగా మారిందన్నారు. ఈవీ ఎక్స్పోలో సిట్రాన్ ఎలక్ర్టిక్ కారు, క్వాంటమ్ ఈవీ బైక్లను మంత్రి ఆవిష్కరించారు.


