
నాగోల్ ఫ్లైఓవర్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో మరో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. నాగోల్లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను నిర్మించామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. ఎల్బీనగర్ – ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎస్ఆర్డీపీలో ప్రారంభించిన 16వ వంతెన. ఉప్పల్- ఎల్బీనగర్ కారిడార్లో కామినేని, ఎల్బీనగర్ చౌరస్తాల్లో వంతెన, అండర్పాస్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఎస్ఆర్ డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేటివి ఇప్పుడు అవి తగ్గిపోయాయని వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామని మంత్రి వివరించారు.




