
2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్లకాలం, ‘కొండపొదుగుపూలు’, ‘చెలిమెలు’ ఇలా ఐదు కవిత్వ సంపుటాలు వెలువరించారు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యునిగా అనేక పురావస్తు ప్రదేశాల్లో పరిశోధనలు చేస్తున్నారు.
తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడు : వేదకుమార్ .యం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్
కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపికపై దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడని కొనియాడారు. అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ఎన్నో శాసనాలు, శిలాఫలకాలు, రాతి చిత్రాలు వెలికి తీస్తూ.. తెలంగాణ సమాజం గర్వించదగ్గ మహా చరిత్రకారుడని వేదకుమార్ మణికొండ తెలిపారు.




