
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వరద ఉద్దృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నీ టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదనేది లెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. భారీగా వరద పోటెత్తడంతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని, ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.




