
కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. ప్రజాకవి, గాయకుడైన గోరెటి వెంకన్న 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జానపద పాటలతో ప్రజల్ని ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. గోరెటి వెంకన్నకు లభించిన ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. ‘దండకడియం’ రచనకు గాను తగుళ్ల గోపాల్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.




