
ఈ ఏడాది నోబెల్ బహుమతుల( Nobel Prize ) ప్రకటన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పాటాపౌటియన్లు నోబెల్ గెలుచుకున్నారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది.మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఎలా ఉంటున్నామన్నదానితోపాటు మన మనుగడకు ఉష్ణం, చల్లదనం, స్పర్శను గుర్తించే మన సామర్థ్యం కీలకం. మన నిత్య జీవితంలో వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి మన నరాల ప్రేరణలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకు పరిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బహుమతి గ్రహీతలు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో వెల్లడించింది.రానున్న రోజుల్లో భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విజేతలను ప్రకటించనున్నారు.




