
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండో రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ- వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుండడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇవాళ తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే అవకాశం.కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1,86,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 1,36,291 క్యూసెక్కుల వరద నీటిని బయటకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.25 అడుగులుగా కొనసాగుతుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.




