
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. కాశ్మీర్లో జి20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. సౌదీ అరేబియా ఈవెంట్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. సమావేశానికి ముందు శ్రీనగర్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులను మోహరించారు.గగనతల భద్రతలో భాగంగా యాంటీ-డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్కు 370 ఆర్టికల్ (Article 370) రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అంతర్జాతీయ వేదికగా శ్రీనగర్ మొదటిసారి. అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.



