
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. సిట్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయాన్ని కోరారు. దీనికి హైకోర్టు మూడు వారాల పాటు సమయాన్ని ఇచ్చింది. పేపర్ లీకేజ్ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.




