
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధి విధానలతో కూడిన సమర్ధవంతులైన అధికారులను నియమించాలని ఆదేశించారు. సివిల్స్, గ్రూప్ I పరీక్షలకు అత్యున్నత శిక్షణ అందించడానికి, ‘ఆలిండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇవి ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించే కేంద్రాలుగా మారాలన్నారు.




