స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్
admin December 14, 2021 0 COMMENTS
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. విపక్షాలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు.ఈ స్థానాలకు సంబంధించి ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్. రమణ, భానుప్రసాద్ గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, ఖమ్మం జిల్లాలో తాతా మధు, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గెలిచారు. ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థులు.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనచారి
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్భవన్కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలగినట్లయింది. మధుసూదనాచారిని మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో కేసీఆర్తో సుదీర్ఘకాలం పని చేసినందుకే ఈ అవకాశం దక్కిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని మధుసూదనాచారి తెలిపారు.




