
వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీకి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం కేటీఆర్ మరోసారి లేఖరాశారు.సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేతన్నల శ్రేయస్సుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.40% ఇన్పుట్ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్ ఫండ్ వంటి పథకాలతో చేనేత, పవర్లూమ్ కార్మికులకు నిరంతరం పని కల్పించి, ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు.కొన్నేళ్లుగా కేంద్రం సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేని రాష్ట్రాలకు పారిశ్రామికంగా ప్రోత్సహకాలు అందజేస్తోందని, ఇది తమలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తోందన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.




