
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.దీని కోసం 1. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం , 2. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం,3. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, 4. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు.ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్నినిర్వహించనున్నారు.దళితుల అభివృద్దికి గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధులో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం కార్యచరణ కూడా సిద్దం చేశారు.




