
నూతన రైల్వే స్టేషన్ సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ తెలంగాణలో పలు జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానం లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వేలైన్ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. మనోహరాబాద్ మీదుగా గజ్వేల్, సిద్దిపేట , రాజన్న సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి, కరీంనగర్, కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ రైల్వేలైన్ పొడవు 151.36 కిలోమీటర్లు. రూ.1160.47 కోట్ల అంచనా తో పనులను ప్రతిపాదించారు. రైల్వేలైన్ నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రచించి పనులు చేశారు. మెదక్ జిల్లాలో 9.30 కి.మీ, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీ, కరీంనగర్ జిల్లాలో 20.86 కి.మీ మేర మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.